మన ఆత్మలన్నీ విశ్వాత్మలో అంతర్భాగమని, సృష్టిలో ప్రతిజీవీ ప్రతి వస్తువు ‘అసలు ‘ వస్తువు ప్రతిరూపాలేనని చెప్పిన ఉపనిషత్ సారాన్ని కథ రూపంలో మలిచి పాశ్చాత్య నవలాకారుడొకడు చెప్తే ఆ గ్రంథాన్ని యావత్ ప్రపంచమంతా హృదయానికి హత్తుకుంది. లెఫ్ తొలుస్తొయ్ అనే ప్రఖ్యాత రష్యన్ రచయిత పలకడం రాని అమెరికన్ల నోట్లోపడి లియో టాల్ స్టాయ్ అయినట్లు లాటిన్ అమెరికన్ రచయిత పాలో కొయెల్ హొ కూడా పాల్ ఖెలో అయ్యాడు. అతను రాసిన ఆ నవల “ది ఆల్ఖెమిస్ట్“ను ఈ వారం పరిచయం చేస్తున్నాను.
నవలలో కథ మనమెన్నోసార్లు విన్నదే. ఒక గొర్రెలకాపరి కుర్రాడికి చర్చి పక్కన పడుకున్నపుడు ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర బంగారు నిధి దొరికినట్టు కల వస్తుంది. కలను నిజం చేసుకుందామని నానాకష్టాలు పడి పిరమిడ్ల దగ్గరకు చేరిన కుర్రాడిని ఓ దొంగల నాయకుడు చితకబాది కలను నమ్మి కష్టాలు పడిన మూర్ఖుడిని చంపకుండా వదిలేసి పోతూపోతూ తనకొచ్చిన కల గురించి చెప్తాడు. ఆ కుర్రాడు పడుకునే చర్చి దగ్గర బంగారు నిధి దొరికినట్టు దొంగల నాయకునిక్కూడా కలొచ్చిందంటాడు. చావుతప్పి కన్నులొట్టబోయిన కుర్రాడు మళ్ళీ వెనక్కివచ్చి చర్చి దగ్గర తవ్వి బంగారునిధిని సొంతం చేసుకుంటాడు. ఇంతే కథ. కానీ నిజానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు చదవడానికి కారణం ఖెలో చెప్పిన కథన విధానం. ఈ కథను ఒక సాకుగా తీసుకుని రచయిత వేదాంత తత్వాన్ని విశదీకరించడం వల్లనే అటు ఆధ్యాత్మిక పరులైన సీనియర్ పాఠకులకు ఇటు వ్యక్తిత్వ వికాస పుస్తకాభిమానులైన యువ పాఠకులకు అంతగా ఆకట్టుకోగలిగింది.
బ్రెజిల్ దేశంలో రియోడిజనిరోలో 1947 ఆగస్టున జన్మించిన పాల్ ఖెలో విప్లవోద్యమాలు అమెరికానంతటినీ ఉద్రేకంతో ఊపేస్తున్నపుడు ఆ నేలంతా పర్యటించాడు. నాటక రంగంలోను, జర్నలిజంలోను కొన్నళ్లు గడిపాక 2001 అనే పేరుతో ఒక ప్రత్యామ్నాయ పత్రికనొక దానిని నడిపాడు. మరింత స్వేచ్చా కోసం పోరాడాడు. అయితే ఇరవై ఐదోయేట పారామిలటరీ దళాలు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి వదిలాక మనిషి పూర్తిగా మారిపోయాడు. సంగీత రంగంలోకి వెళ్లి అత్మికతను సంతరించుకున్నాడు. మొదట కలలోను, తర్వాత నిజంగాను కనిపించిన ఒక మనిషి సలహాతో కాథలిక్ గా మారిన ఖెలో రాయడాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. మొదట్లో అమ్మకాలు నిరాశాజనకంగా ఉన్నా ఈ నవల విడుదల బ్రెజిల్ సాహిత్య చరిత్రలో మేలిమలుపు. ఖెలో నవలలు పిలిగ్రిమేజ్, ఫిఫ్త్ మౌంటెన్, ఎలెవెన్ మినిట్స్, జహీర్, వాకిరీస్.. అన్నీ ప్రపంచ పాఠకులంతా ఇష్టంతో ఆసక్తితో చదివినవే. ఇక ఆల్ ఖెమిస్ట్ నవలను రెండు వారాల కిందట కె. సురేష్ తెలుగులోకి అనువాదం చేశారు. నేనింకా ఆ పుస్తకాన్ని కొనలేదు.
చదివించి కొడుకును చర్చికి పంపిద్దామని అనుకున్న అమ్మానాన్నల అభీష్టానికి వ్యతిరేకంగా పర్యాటకుడు కావాలన్న కోరికతో వారిచ్చిన డబ్బుపెట్టి కొన్ని గొర్రెలు కొనుక్కుని బయల్దేరతాడు. మహా ప్రస్థానానికి నాంది పలుకుతాడు. ఎండా వానా ఆకలీ దాహమూ అతడి లక్ష్యాన్ని పిసరంతైనా మార్చలేదు. అవసరాలకు గొర్రెల ఉన్ని అమ్ముకుంటూ ఒకచొటునుంచి మరోచోటుకు తిరుగుతూ గడుపుతున్న కుర్రాడు శాంటియాగోకు ఓ వ్యాపారి కూతురు నచ్చుతుంది. ఖచ్చితంగా అదే సమయంలో ఆ కుర్రాడికి ఓ కల వెంటాడుతుంటుంది. ఎక్కడో ఈజిప్ట్ దేశంలో పిరమిడ్ల దగ్గరున్న అమూల్యమైన నిధి గురించి అస్పష్టమైన కల అది. అమ్మాయిని కలవడానికి వెళ్తూవెళ్తూ కల గురించి కనుక్కుందామని తారిఫా ఊర్లో స్వప్నాలను విశ్లేషించే దేశ దిమ్మరి ముసలమ్మ దగ్గరికి వెళతాడు. నిధిలో పదో వంతు వాటా అడిగి, తప్పక నిధి కుర్రాడి వశమవుతుందని చెప్తుంది. పుస్తకాలు చదవడం అనే మంచి అలవాటున్న ఆ కుర్రాడు ఏదో పుస్తకం చదువుతున్నప్పుడు ఒక ముసలాయన వచ్చి ఈ మాటా ఆ మాటా చెప్తూ ఒక్కసారిగా పిరమిడ్ల దగ్గరకు బయల్దేరమని సలహా ఇస్తాడు. తన కల గురించి ఇతడికెలా తెలిసిందని ఆశ్చర్యపోతుండగా చకచకా కుర్రాడి గత వివరాలన్నీ చెప్పి పదో వంతు గొర్రెలు తీసుకుని నిధి ప్రయాణం గురించి మరిన్ని వివరాలు చెప్తాడు. సాలెం రాజయిన ఆ వృద్ధుడు యూరిం, తమ్మిం అనే రెండు విలువైన రత్నాల్లాంటి రాల్లిచ్చి శకునాలను నమ్మమంటాడు. ప్రకృతి చెప్పే శకునాలు, తన బుధ్ధికి నచ్చిన శకునాలు తనకెప్పుడూ మంచి చేస్తాయని వృద్ధుడు హితవు పలుకుతాడు. కుర్రాడు తన ఆస్తి గొర్రెలను అమ్మేసి ఆ డబ్బుతో పిరమిడ్లకోసం బయలుదేరతాడు.
ఆఫ్రికాలో దిగగానే టాంజీర్ అనే పట్టణం చేరుకుంటాడు. సాయం చేస్తున్నాడనుకున్న అపరిచుతుడైన స్నేహితుడొకడు దగ్గర చేరి డబ్బంతా కాజేసి దిక్కు తెలియని చోట, భాష తెలియని చోట సాంటియాగోను వదిలేసిపోతాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా మిగిలిన కుర్రాడి వొడిలో రెండు రాళ్లు, వృద్ధుడి విలువైన మాటలు మాత్రమే ఉంటాయి. స్ఫటిక వ్యాపారి దగ్గర నెమ్మదిగా ప్రాపు సంపాదించి కూలీకి చేరిపోతాడు. కుర్రాడు చేరిన తర్వాత వ్యాపారం నెమ్మదిగా పుంజుకోవడం గమనించిన స్ఫటిక వ్యాపారి కుర్రాడిని ప్రేమగా చేరదీస్తాడు. కుర్రాడిచ్చిన సలహాలతో వ్యాపారం మరింత మరింత లాభాలను గడిస్తుంది. ఒకరోజు కొండమీద స్ఫటిక కప్పుల్లో టీ అమ్ముదామని కుర్రాడిచ్చిన సలహా అమలులో పెట్టగానే వ్యాపారం వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా మారిపోతుంది. కుర్రాడికి డబ్బులివ్వడం కూడా పెంచుతుంటాడు. ఆ డబ్బంతా జాగ్రత్తగా కూడబెట్టి ఒకరోజు వ్యాపారి అనుమతి తీసుకుని మళ్లీ పిరమిడ్ల వేటకు బయలుదేరుతాడు. ఈ సారి జాగ్రత్తగా పెద్ద బృందంతో ఒంటెలపై ఎడారి ప్రయాణం మొదలవుతుంది.
ఆ ఎడారి గుడారాల బిడారంలో ఆంగ్లేయుడు పరిచయమవుతాడు. లోహాలనుంచి బంగారం తయారుచేసే పరసువేది విద్యను అధ్యయనం చేస్తున్న ఆ వ్యక్తితో కుర్రాడికి దోస్తీ కుదురుతుంది. ఎడారి జీవితం కుర్రాడికొక ముఖ్య విషయం నేర్పుతుంది – వృద్ధుని మాటకు కొనసాగింపుగా. విశ్వ భాష ఒకటుంది. అది నేర్చుకున్నప్పుడు భావ వినిమయానికి భాష అడ్డంకి కాదనేదే ఆ విషయం. నెమ్మది నెమ్మదిగా కుర్రాడు ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటాడు. ఆంగ్లేయుడికి ఆ ఎడారి ప్రాంతంలో పరసువేది విద్య తెలిసిన మనిషి ఉన్నాడని తెలుస్తుంది. అతడ్ని కనుగొనే ప్రయత్నంలో కుర్రాని సాయం కోరుతాడు. ఇద్దరి వెతుకులాటలో కుర్రాడికి ఒక ఎడారి బాలికతో పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ అమ్మాయి ఫాతిమా నిధి విషయం తెలుసుకుని కుర్రాడిని ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది. విజయంతో తిరిగొచ్చేదాకా ఎదురుచూస్తానంటుంది. కాని మొత్తం ఆ ప్రయాణం కొన్నాళ్లపాటు అక్కడ ఆగిపోతుంది. దానికి కారణం ఎడారిలో యుద్ధం జరుగుతుండడమే.
ఇంగ్లిష్ మనిషికి దొరకాల్సిన పరసువేది విద్య గురువు తనకు తగిన శిష్యుని వెతుక్కుంటూ కుర్రాడి దగ్గరకు వచ్చేముందు కొన్ని అతీత సంఘటనలు జరుగుతాయి. విశ్వభాష నేర్చుకునే క్రమంలో అన్ని శకునాలను జాగ్రత్తగా అధ్యనం చేయడం మొదలుపెడతాడు. దాన్లో భాగంగా రెండు పక్షులు ఎగిరే తీరునుబట్టి తానున్న చోటులో జరగబోయే యుధ్ధాన్ని దాని ఫలితాన్ని ఊహిస్తాడు. దాని గురుంచి ఎడారిలో వారికి హెచ్చరించి, ప్రియురాలి దగ్గర వీడ్కోలు తీసుకొని, పరసువేది గురువుతో పిరమిడ్ల వేటలో ముందుకు పోతుంటే యుద్ధంలో వైరి వర్గం వీరిని పట్టుకుంటుంది.
ఆ ముఠాతో పరసువేది గురువు కావాలనే కొన్ని అబద్దాలు చెప్తాడు. కుర్రాడైన శాంటియాగోకు విశ్వభాష తెలుసని కావాలంటే అతడు గాలిలో (అంటే ప్రకృతిలో) కలిసిపోగలడని వారికి చెప్పగానే మూడ్రోజుల్లో ఆ విద్య ప్రదర్శించాలని లేదంటే చావు తప్పదని ముఠా నాయకుడు హెచ్చరిస్తాడు. నీవాపని తప్పక చేయగలవని ప్రయత్నించమని వృద్ధుడు ప్రోత్సహిస్తాడు. ప్రయాణంలోను, ఇప్పుడు కూడా గురువెప్పుడూ హృదయాన్ని వినమని కుర్రాడికి చెప్తూనే ఉంటాడు. తన మనసే తనకన్నీ విషయాలూ తెలియజెప్తుందని బోధిస్తాడు. మూడో రోజు తనను గాలిగా మార్చమని ఎడారి ఇసుకను కోరుతాడు. వాయువు సాయం తీసుకోమని ఇసుక చెప్తుంది. గాలితో మాట్లాడితే మనిషిని తనలాగా చేసే శక్తి తనకు లేదని సూర్యుడ్ని అర్థించమని కోరుతుంది. దానికోసం గాలిని ఇసుక తుఫాన్ సృష్టించమని కోరినప్పుడు తానలాగే చేస్తుంది. ముఠా బెదిరిపోతుంది. సూర్యునితో వాదనకు దిగిన కుర్రాడు అతడ్ని మెప్పించి తనను గాలిగా మార్చమని కోరుతాడు. అది తనవల్ల కాదని పరమాత్మను ప్రార్ధించమని సలహా ఇస్తాడు. పరమాత్మను చూస్తున్న కొద్దీ అతడికి ‘అసలు ‘ సంగతి బోధపడుతుంది. తానూ విశ్వాత్మ వేర్వేరు కాదని, అంతా ఒకటేనని తెలిసిపోతుంది. అంతే.
పరసువేది గురువు, కుర్రాడు పిరమిడ్లకు వెళ్లే దారిలో సన్యాసులుండే మఠంలో కాస్త విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడే అక్కడి సన్యాసికి కొన్ని వస్తువులు అడిగి వృద్ధుడు తనదగ్గరున్న మణిరాయి (ఫాస్ఫరస్ స్టోన్)తో రాగిని బంగారంగా మార్చి దానిని నాలుగు భాగాలు చేసి ఒక భాగం తాను తీసుకుంటాడు. రెండో భాగం సాంటియాగోకు, మూడో భాగం సాయపడ్డ సన్యాసికిస్తాడు. నాలుగో భాగం కూడా సన్యాసికే ఇచ్చి కుర్రాడు మళ్లీ ఇక్కడికి వస్తే ఇవ్వమని చెప్పి అక్కడనుంచి శెలవు తీసుకుంటాడు. కుర్రాడు పిరమిడ్ల ప్రదేశానికి చేరుకుని కలలో కనిపించిన చోటు వెదికి తవ్వడం మొదలుపెడతాడు. కొంత లోతుకు తవ్విన తర్వాత అక్కడికో దొంగల ముఠా వస్తుంది. ఈ కుర్రాడు అక్కడ ఏదో దాస్తున్నట్లుగా భావించి ఏమిటో చెప్పమని చితగ్గొడతారు. నిధి కోసం తవ్వుతున్నానని చెప్పినా వినిపించుకోరు. తన్ని తన్ని చివరకు ఆ నాయకుడు ఒక మాట అంటాడు. తనకు కూడా స్పెయిన్లో ఒకచోట చర్చిదగ్గర నిధి ఉన్నట్టు కల వచ్చిందని చెప్తాడు. అయినా తాను మూర్ఖుడిలాగా అక్కడికి వెళ్లలేదని అంటాడు. సన్యాసి దగ్గరకు పరిగెత్తి వెళ్లి తిరుగు ప్రయాణానికి డబ్బులు తీసుకుని తన గడ్డకు చేరుకుని నిధిని దక్కించుకుంటాడు. దేవుడు తనకు పాఠం చెప్పిన తీరుకు సంబరపడతాడు.
ఈ నవల చదవగానే రెండు పాత పుస్తకాలు గుర్తుకొస్తాయి. 13వ శతాబ్ది పర్షియన్ కవి రూమీ చెప్పిన మాట గుర్తొస్తుంది. “బాగ్దాద్ లో ఉంటూ కైరోగురించి కలలు కంటూ; కైరోలో బాగ్దాద్ గురించి కలలు కంటూ…” అన్న మాట మొదటిది కాగా, రెండోది నోబెల్ బహుమతి పొందిన స్విస్ రచన “సిద్ధార్థ“. హెర్మన్ హెస్ నవలకు ఖెలో నవలకూ ఎన్నో పోలికలు ఉంటాయి. సంప్రదాయ విద్యకు భిన్నంగా కొత్తదారి వెతుక్కునే ప్రయత్నాన్ని ఇద్దరి నవలల నాయకులూ చాలా చిన్నపుడే మొదలుపెడతారు. తల్లిదండ్రులను ఒప్పించి కొత్తదారిలో ప్రయాణం ప్రారంభిస్తారు. వారి ప్రయత్నాలకు ఇబ్బడి ముబ్బడిగా సకల ప్రకృతి సహకరిస్తుంది. అందుకోసమే ఖెలో నవలకు నోట్ లో ఈ సంగతులన్నీ చాలా స్పష్టంగా, వివరంగా, ఆసక్తికరంగా, ఉత్తేజకరంగా వివరిస్తాడు. అసలీ ముందుమాటతోనే మనకీ నవలపై ఆసక్తి కలుగుతుంది. మొత్తం ఈ విశ్వమంతా మనుషులుగా మనం చేసే ప్రయత్నాలన్నింటికి సహకారంగా కుట్ర పన్నుతూ ఉంటుందని రచయిత చెప్తాడు. మనల్ని విజయం సాధించకుండా నాలుగే నాలుగు శక్తులు నిరోధిస్తున్నాయని వాటిని అధిగమిస్తే మనకు ఎదురుండదంటాడు. మొదటిది మన చుట్టూ ఉన్నవాళ్లు నిరంతరం బోధించే ‘మనవల్ల కాదులే‘ అనే ధోరణి. రెండోది మనల్ని ముందుకు పోనివ్వకుండా ఆపేసే ‘ప్రేమ ‘. మూడో అడ్డంకి ‘ఓడిపోతామేమోనన్న భయం‘. ఈ మూడు అధిగమించేక పట్టి ఆపే నాలుగో శత్రువు ‘విజయం పొందబోతున్న చివరి క్షణంలో రాజీపడడం’. ఈ నాలుగు దుర్గుణాల వల్ల మనం మురిపెంగా ప్రేమించే ప్రతిదాన్ని మనమే మన చేతులతోనే చిదిమేసుకుంటున్నాం.
సిద్ధార్థుడికి స్వయంగా వాసుదేవుడే పడవ నడిపేవానిగా వచ్చి రియలైజ్ కావడంలో సాయం చేసినట్టుగా శాంటియాగోకు పరసువేది గురువు స్వయంగా అన్నీ నేర్పిస్తాడు. అక్కడ పల్లెకారుడు నదిని వినమని అర్థిస్తే ఇక్కడ హృదయాన్ని వినమని కోరుతాడు. వినడం ద్వారా మాత్రమే మనం మంచి అభివ్యక్తి నివ్వగలమని స్పష్టం చేయడమన్నమాట. వాల్లకు కావలసింది వారికి దొరికినప్పుడు అక్కడ వాసుదేవుడు, ఇక్కడ గురువు ఇద్దరూ శిష్యులను విడిచిపెడతారు. ప్రయత్నం చేయడం, మరల ప్రయత్నం చేయడం, తిరిగి ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే మన కలల్ని సాకారం చేసుకో గలమని ప్రభోదించే మహత్తర నవల మన యువత తప్పక చదవాలి. మరి మీరేమంటారు?
Good review. I too like this book, valuable message in simple words.
నవలా పరిచయం బాగుంది,సమీక్షకోసం ఎదురు చూస్తూ
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
manchi pustakam. nenu english version chadivanu.
పరిచయం చక్కగా రాశారు. అసలు పుస్తకం నన్నంతగా ఆకట్టుకోలేదు, కానీ అదిక్కడ అప్రస్తుతం. ఈ టపా శీర్షికలో మీ ఉద్దేశం “కాసారం” ఏమో అని అనుమానం వచ్చింది. మీరు ఇటీవలే తెరతీసినట్టున్నారు, అంచేత కొద్దిగా ఆలస్యంగానైనా బ్లాగ్లోకానికి స్వాగతం చెప్పటం అనుచితం కాదనుకుంటాను. మీ నించి మరిన్ని మంచి టపాల కోసం చూస్తుంటాం.
fantasy novel fantastic